హైదరాబాద్: మద్యం మత్తులో యువత చిత్తవుతున్నారు. వీకెండ్ వస్తేచాలు పూటుగా తాగి రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. పీకలదాకా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. కొన్ని ఘటనల్లో ప్రాణాలుసైతం కోల్పోతున్నారు. తాజాగా నగర శివార్లలోని ఎల్బీ నగర్ అండర్ పాస్లో ఓ కారు బోల్తాపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాగర్ రింగ్రోడ్డు వైపునుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అండర్ పాస్లో బోల్తా కొట్టింది.
అయితే ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును అక్కడి నుంచి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని అంచనావేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరిది, అందులో ఎంతమంది ఉన్నారనే విషయాలు తెలియాల్సి ఉన్నది. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే వనస్థలీపురంలో డిసెంబర్ 31న జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పీకలదాకా తాగిన యువకులు ఆంధ్రకేసరి నగర్లో కారును వేగంగా నడుపుతూ ఓ అపార్టమెంటు గోడకు ఢీకొట్టారు. దీంతో అది పల్టీలు కొడుతూ కొద్దిదూరంలో బోల్తా పడింది. అయితే కొద్దిసేపటికి కారులోనుంచి దిగిన యువకులు అక్కడి నుంచి ఉడాయించారు.