నల్లగొండ : మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా సోమేష్ కుమార్ చెర్వుగట్టు ఆలయానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఆలయ చైర్మన్ మేకల అరుణ, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ సోమేస్ కుమార్ కుటుంబానికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు.
సీఎస్ కుటుంబసభ్యులతో కలిసి పార్వతిపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనకు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ..చెరువుగట్టును స్వామిని దర్శించుకోవాలని ఎప్పటి నుంచో ఉన్నా.. శివరాత్రి సందర్భంగా స్వామి వారి చెంతకు వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం సహకారం అందించాలని కోరుతూ స్థానిక సర్పంచ్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీఎస్ సోమేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో సీఎస్ ప్రత్యేక పూజలు చేశారు.