శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాధి క్రతువులు చేశారు. సాయంకాలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల పూజలు నిర్వహించారు. ఆరుబయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక అభిషేకం నిర్వహించి.. పుష్పాలతో అర్చించారు.
అనంతరం సంధ్యా సమయంలో నందిమండపం వద్ద కొలువైన శనగల బసవన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని అర్చకపండితులు మహా సంకల్పాన్ని పఠించి.. పంచామృతాలు ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టించి అష్టోత్తరశతనామ పూజాదికాలు జరిపి నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.