హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక శిక్షణ లేదు. కానీ, చిత్రకళంటే అమితాసక్తి. నేర్చుకోవాలన్న తపన మరెంతో. అద్భుతాలు సృష్టించాలన్న లక్ష్యంతో వివిధ రకాల చిత్రకళలపై పట్టుపెంచుకున్నారు మాధురి శ్రీకాంత్. నల్లగొండ జిల్లాకేంద్రంలో పుట్టిన మాధురి.. చిన్నతనంలో తల్లి వేసిన రంగోలి (ముగ్గుల) నుంచి స్ఫూర్తి పొందారు. చిత్రకళలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కళలు, సంస్కృతి, ఫ్యాషన్ ప్రదర్శనలకు ప్రత్యేక స్థానమైన ఇటలీలోని మిలాన్లో ఈ నెల 23 నుంచి మే 3 వరకు రొమాంటికా అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శన జరుగనున్నది. ఎంఏడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో కళాకృతులను ప్రదర్శించేందుకు మాధురికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎగ్జిబిషన్లో కళను ప్రదర్శించనున్న ఏకైక భారతీయ చిత్రకారిణి మాధురి కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా కళా ప్రేమికులు, కళా పోషకులు ఎగ్జిబిషన్లో పాల్గొని చిత్రాలను కొనుగోలు చేస్తారు.
ప్రస్తుతం అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్న మాధురి ఈ ఎగ్జిబిషన్లో బెనెవొలెంట్ బుద్ధ (జ్ఞానముద్రలో ఉన్న బుద్ధుడు), గోల్డెన్ గీషా, షాడో స్వే (చెక్కపై 22 క్యారెట్ల బంగారం, సెమి-ప్రీషియస్ స్టోన్స్, పోస్టర్ కలర్స్తో చిత్రించిన తంజావూరు పెయింటింగ్లు) మొత్తం మూడు చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఒక్కో పెయింటింగ్ విలువ 2 వేల అమెరికన్ డాలర్లు ఉంటుంది. తంజావురు, మధుబని, మురాల్స్, వర్లి, టెక్చర్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్స్ వంటివి ఆమె చిత్రాల్లో ఉన్నాయి. 120 చిత్రాలు మాధురి కుంచె నుంచి వెలువడ్డాయి. ఇద్దరు పిల్లలున్న మాధురి వృత్తిపరంగా సాంకేతిక నిపుణురాలు (టెక్నో క్రాట్). అమెరికాలోని ట్రూయిస్ట్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించేందుకు దీన్ని ఓ చక్కటి అవకాశంగా భావిస్తున్నానని మాధురి తెలిపారు. ఆలోచనలు, జ్ఞాపకాలను సందేశాల రూపంలో వెల్లడించడంతోపాటు చిత్రకళకు మరింత వెలుగునిచ్చేందుకు ఈ ప్రదర్శన సరికొత్త అవకాశాలకు బాటలు వేస్తుందని చెప్పారు.
తెల్లవారకముందే వాకిట్లో అమ్మ వేసిన ముగ్గులను చూసి అబ్బురపడేది..
‘అబ్బ.. ఎంత బాగున్నాయో’ అంటూ చూస్తూ ఉండిపోయేది.. అప్పటినుంచే రంగులను నేస్తాలుగా మలుచుకుని, పాఠశాల స్థాయిలోనే అద్భుత చిత్రాలతో జాతీయస్థాయిలో మెరిసింది నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన మాధురి శ్రీకాంత్. ప్రస్తుతం ఇటలీలోని
‘రొమాంటికా’ ఎగ్జిబిషన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకుని అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.