Prakash Raj | ‘పక్కింటి పుల్లకూర రుచిగా ఉన్నట్టు వాసన వస్తుంది. తిన్న తరువాత కాసేపటికి తిన్నది విషమని తెలుసుకునేలోపే నష్టం జరిగిపోతుంది. తాత్కాలిక భావోద్వేగాలకు లోనైతే ఆర్నెల్ల తరువాత అచేతనమైపోతాం. అప్పుడు ఐసీయూలో వేసినా ఫలితం ఉండదు. అటువంటి మార్పునా ప్రజలు కోరుకునేది?’ అని ప్రశ్నిస్తున్నారు విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం, వివిధ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న పద్ధతులపై ఆయన తనఅభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. తెలంగాణ మట్టి మనిషి కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఘంటాపథంగా చెబుతున్న ప్రకాశ్రాజ్తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
ఒక రైతుగా, నటుడిగా తెలంగాణ ఎన్నికలను మీరెలా వ్యాఖ్యానిస్తారు?
నేనొక రైతును, నటుడిని. అవి నా వృత్తులు. అంతకన్నా ముందు నేను ఈ దేశ పౌరుడిని. దేశంలో ఐదేండ్లకోసారి జరిగే ఎన్నికల్లో నేను ఎటువైపు ఉండాలి? అన్నది నాకు ప్రధానం. ఈ క్రమంలో నా దేశం ఎటు వెళుతున్నది? పౌరుడిగా నా బాధ్యత ఎంత? క్రితం నుంచి నేనేం నేర్చుకున్నాను. ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలకులు వ్యవహరిస్తున్నారా? లేదా? అన్నదే నాకు ముఖ్యం. గెలవటం.. ఓడిపోవటం అన్నది రాజకీయ నాయకులకు సంబంధించినది. అయితే వారిని గెలిపించటం, ఓడించటం అన్నది ప్రజల కర్తవ్యం. తెలంగాణ ఎన్నికల పరిణామాలను ఒక పౌరుడిగా పరిశీలిస్తున్నా. ఎవరేం మాట్లాడుతున్నారు? వారి గత చరిత్ర ఏమిటి? ఇవి నాకు ముఖ్యం. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత జరిగిన పరిణామాలు, జరుగుతున్న మార్పులకు నేనొక ప్రత్యక్ష సాక్షిని. ప్రజల కష్టసుఖాల్లో భాగమైన నాయకుడు కేసీఆర్ అన్నది నిర్వివాదాంశం. చిన్న వయసున్న తెలంగాణ.. దేశంలోనే అనేక పెద్ద రాష్ర్టాలను మించిన ప్రగతిని సాధించింది. ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రజలను కరుణతో చూస్తున్న నాయకుడిగా కేసీఆర్ అందనంత ఎత్తులో ఉన్నారు. ఇలాంటి నాయకుడిని, పాలకుడిని ప్రజలు దూరం చేసుకుంటారని అనడం మూర్ఖత్వమే అవుతుంది.
కర్ణాటకలో మార్పు జరిగింది. అదేమార్పు ఇక్కడ వస్తున్నదని ప్రచారం. దీన్నెలా చూడాలి?
కర్ణాటక మార్పునకు, తెలంగాణలో మార్పు జరగాలి అనే వాదనకు సంబంధం లేదు. కర్ణాటక ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు. కానీ, ఇక్కడ కేసీఆర్కు ప్రత్యామ్నాయం ఏదీ? కర్ణాటకలో ఉన్నం త అవినీతి, అన్రెస్ట్ ఇక్కడ ఉందా? 40-50 ఏండ్ల తెలంగాణ సమాజం అన్రెస్ట్లో గడిపింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. కొండారెడ్డి (మహబూబ్నగర్ జిల్లాలోని) గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నప్పుడు అక్కడ కనీసం రోడ్డు కూడా లేదు. ఇప్పుడు ప్రతి గ్రామానికీ రోడ్లు వచ్చాయి. పాడిపంటలతో తెలంగాణ పచ్చగా మారింది.
ప్రకాశ్రాజ్కు కేసీఆర్తో రాజకీయ బంధం ఉన్నది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు.. అనేవారికి మీ సమాధానం?
నేనొక పౌరుడిని. నటుడిని. తెలంగాణ కోసం జరిగిన పోరాటం, దాని చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ప్రజల జీవన స్థితిగతులు, కమిట్మెంట్, ఆత్మాభిమానం ఇలా అనేక అంశాల్లో పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన సంపూర్ణ మానవుడు కేసీఆర్. కాబట్టి ఆయనంటే అభిమానం
తిరుచ్చిలోని ప్రణవ్ జువెలర్స్కు సంబంధించి ‘పోంజీ’ స్కీంలో ఈడీ మీకు నోటీసులు జారీ చేసిందని బీజేపీని, ప్రధాని ని వ్యతిరేకిస్తున్నారా?
ప్రశ్నించిన, ఎదిరించిన వాళ్లను భయపెట్టి దారికి తెచ్చుకోవడమనే ప్రక్రియ మోదీ ప్రైమ్ మి నిస్టర్ అయినప్పటి నుంచి కొనసాగుతున్నదే. ఈడీకి భయపడేవాడిని కాదు. ధైర్యంగా ఎదుర్కొంటా. ఈడీ, ఐటీ వంటివి పాత పడిపోయా యి. కొత్త స్క్రిప్ట్ను రాసుకునే ఓపిక వాళ్లకు లేదు.
గుజరాత్ మాడలే దేశానికి శరణ్యం. డబుల్ ఇంజిన్ సర్కారే వస్తుంది అని బీజేపీ అంటున్నది.. ఇందులో నిజమెంత?
మోదీ ప్రధాని కాకముందు గుజరాత్ మాడల్ అన్నారు. దేశమంతా అదే మాడల్ తెస్తామని ఊదరగొట్టారు. ఇప్పుడు ఏమైంది? కరెంటు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. దేశమంతా మతాన్ని పరివ్యాప్తం చేస్తున్నారు. పదేండ్ల పసిప్రాయంలోనే పంజాబ్ను దాటి పంట పండించిన తెలంగాణ అసలు ఇంజిన్. గుజరాత్ ఎక్కడుందండీ?
ఎన్నిక ప్రచారంలో పార్టీలు అనుసరిస్తున్న విధానం, ప్రత్యేకించి నాయకుల ప్రసంగాలను ఒక విలక్షణ నటుడిగా మీరేం గమనించారు?
సీ… ప్రచార అవార్డులు ఇవ్వాల్సి వస్తే మోదీకి ఆస్కార్ ఇవ్వాలి. ఆయన ప్రధానమంత్రిగా కాకుండా ప్రచారమంత్రిగా, ఒక్క రైలుకు వందలసార్లు జెండా ఊపి రైల్వే స్టేషన్మాస్టర్గా అనేక పాత్రలను పోషిస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీల విధానాన్ని నాయకులు ప్రచారం చేస్తారు. చేయాలి. కానీ, దురదృష్టకరం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీలోని నాయకులు సభ్యత, సంస్కారాన్ని విస్మరించి నేల విడిచిసాము చేస్తున్నారు. తమ ముందు పిల్లలు ఉన్నారు. దేశాన్ని చోదకశక్తిగా నడిపే యువత ఉన్నది. మన నుంచి వాళ్లు ఏం నేర్చుకుంటారు? అన్న కనీస స్పృహ మరచి మాట్లాడుతున్నారు. ఏమండీ..! తన నరనరాన తెలంగాణను దట్టించుకొని, చివరికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుడిని, కేవలం పదేండ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణను దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిపిన కేసీఆర్ను పట్టుకొని ‘పుట్టుకను..తల్లిని ప్రస్తావించటం సంస్కారమా? జనం నవ్వుకుంటారనే కనీసం ఇంగితం ఉండొద్దా? ప్రజాస్వామ్య విధానాన్నే అపహాస్యం చేసే రీతిలో డబ్బుతో అడ్డంగా దొరికిన దొంగలు కూడా తమ పూర్వప్రస్థానాన్ని మరచి మాట్లాడటం ఏవగింపు కలుగుతున్నది. నోటికొచ్చినట్టు తిడుతూ, పరుష పదజాలం వాడితే ప్రజలు ఓట్లు వేయరు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నాను అని మీకు అనిపించటం లేదా?
మీరేమైనా అనుకోండి… నాకు నచ్చింది నచ్చినట్టు చెప్పటమే నా స్వభావం. సమాజాన్ని, మనుషులను ప్రేమించే నాలాంటి వాళ్లు సందర్భం వచ్చినప్పుడు చెప్పకపోతే నష్టం చేసినట్టు అవుతుంది. బీఆర్ఎస్సా, కాంగ్రెస్సా మరొకటా..మరొకటా? కాదు. తెలంగాణలో కేసీఆర్ విధానాలను ఇష్టపడతా. తన ప్రజల పట్ల ఆయనకు ఉన్న కమిట్మెంట్ను చూసి ముచ్చటపడతా. నేనేం ఆ పార్టీ కార్యకర్తను కాదు. సాక్షాత్తు ఈ దేశ పౌరుడిని. దేశ ప్రజల హితం కోరేవాళ్లంతా నాకు ఆరాధ్యులే. కేసీఆర్ నాకు నచ్చిన నాయకుడు. నేనాయనకు అభిమానిని. మీరేమైనా అనుకోండి నాకేం అభ్యంతరం లేదు.
కేసీఆర్కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకొంటున్న వారిని చూస్తే మీకేమనిపిస్తున్నది?
పిచ్చిపట్టిందని నవ్వి ఊరుకోవటం తప్ప చేసేదేమున్నది. తెలంగాణ నిండైన మట్టిమనిషి కేసీఆర్. ఆయనలో తెలంగాణ మట్టి పరిమళం ఉన్నది. ఈ మట్టిలో కేసీఆర్ సంతకం ఉన్నది. బయటికి ఎన్ని మాట్లాడినా కేసీఆర్ను చూసి లోలోపల మురిసిపోతారు. అనుకరిస్తారు. ఆచరించాలని తహతహలాడతారు. కానీ, అది అసాధ్యం. అనుకరిస్తామని అనుకున్నవాళ్లు అడుగువేయగానే దొరికిపోతారు. టాలెస్ట్.. అండ్ హైఎస్ట్ పర్సనాలిటీ కేసీఆర్, అండ్ ఏ బిగ్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ బిల్డ్ ఏ సీజన్. కేసీఆర్ సీజనల్ లీడర్ కాదు. రీజన్ లీడర్. కేసీఆర్కు ప్రత్యామ్నాయం కేసీఆరే. ఆయన దరిదాపుల్లోకి ఎవరూ రారు. మళ్లీ చెప్తున్న. తెలంగాణ మట్టి మనిషి కేసీఆర్. తెలంగాణను మళ్లీ పాలించేది ఆయనే. ఆయన చేతుల్లో రాష్ట్రం ఉంటే సుభిక్షం. సుసంపన్నం. ఎవరికీ అనుమానం అక్కర్లేదు.
కేసీఆర్కు రెండు టర్మ్లు అధికారం ఇచ్చాం. ఈసారి మార్పు రావాలని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఇందులో నిజమెంత?
ప్రజల జీవితాల్లో మార్పు జరిగింది. ఆ మార్పు చేసింది ముమ్మాటికీ కేసీఆరే! గుజరాత్లో మోదీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి (సాంకేతికంగా నాలుగు సార్లు… దాదాపు 13 ఏండ్లు) ప్రధానమంత్రిగా పనిచేయవచ్చు. కానీ, ఇక్కడ మూడో టర్మ్ కేసీఆర్ ఉండొద్దని కోరుకోవటం ఏమిటీ? తెలంగాణ రాకముందు రైతుల జీవితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా మారాయి? మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు ఎంతోదూరం నడిచిపోయిన దృశ్యాలను నేను కండ్లారా చూశాను. ఇప్పుడా పరిస్థితి ఉన్నదా? ఇంటి ముందు నల్లా.. కంచంలోకి కడుపునిండా అన్నం దొరుకుతున్నదా? లేదా? ఇవన్నీ చెప్పేందుకు మీరెవరు అంటారేమో? కానీ, ప్రజల మేలు కోరే సాటి మనిషిని. ఏమండీ దుస్తులు మార్చినంత సులువుగా ప్రభుత్వాన్ని మారుస్తారా?
బీఆర్ఎస్ నుంచి మీకు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది. అందుకే ప్రకాశ్రాజ్ , కేసీఆర్ను వెనుకేసుకొస్తున్నారని కొందరి వాదన.. ఇందులో నిజమెంత?
ఇది ఇమ్మెచ్యూర్డ్ వాదనంటాను. ఒక పార్టీ, నాయకుడి విధానాలు నచ్చాయని, ప్రజలకు అవి మేలు చేస్తున్నాయని చెబితే ఆ పార్టీ సభ్యుడిగా భావిస్తారా. ఈ దేశంలో ప్రకాశ్రాజ్కు పేరు లేదా? హోదా లేదా? కేసీఆర్లో మీరేం చూస్తున్నారో నాకు తెలియదు. ఆయనలో ఈ దేశాన్ని అభ్యుదయ పథంలో ముందుకు నడిపించే దార్శనికుడు ఉన్నారు. ఇది చాలామందికి రుచించదు. ప్రధానమంత్రికి ఉండవలసిన ఆలోచనా దృక్పథం ఉన్న నాయకుడు కేసీఆర్. పదేండ్లలోనే తెలంగాణను నెంబర్ వన్ చేశారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా మంత్రులందరూ వస్తున్నారు? అక్కడిలా మార్పు ఇక్కడ తెస్తామని అంటున్నారు. దీన్ని మీరెలా చూస్తారు?
ఓన్లీ డ్రామా అంటాన్నేను. ఒక అంశంపై కర్ణాటక మంత్రికి ఫోన్ చేస్తే ‘నేను అక్కడ లేను. తెలంగాణ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాను అన్నాడు. నాకు నవ్వొచ్చింది. ‘ఇక్కడ చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టి.. అక్కడికి వెళ్లి ప్రచారం చేయడం ఏమిటి? కర్ణాటకలో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ, తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వద్దనుకోవటం లేదు. మీకు సమయం.. డబ్బూ రెండూ దండుగే..’ అని చెప్పాను.
బాధ్యతగా ఆలోచించాలి..
తల్లి కంటిచూపుతో బాధపడుతుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన మనం చేయం. కానీ, అదేంటండీ కేసీఆర్ కంటివెలుగు అని కార్యక్రమాన్ని తెచ్చాడు. రెండు టర్ములు చేశాడని బోర్ కొట్టడం ఏమిటీ? బాధ్యతగా
ఆలోచించాలి కదా. పక్కింటి పుల్లకూర రుచిగా వాసన వస్తుంది. తిన్న తరువాత అది విషమని తెలుస్తుంది.
అన్నిటా సంపూర్ణ అవగాహన..
భాష తెలియనివాళ్లు.. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనివాళ్లు, సమాఖ్య స్ఫూర్తిని అర్థం చేసుకోని వాళ్లు వచ్చి ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్ముతారు అనుకోవటం భ్రమ. కేసీఆర్ వయసు, పరిణతి, అవగాహన అవతలి వాళ్లల్లో ఎవరికి ఉన్నదో చెప్పండి? చెవి ఉన్న నాయకుడు కేసీఆర్. వింటారు, ఆలోచిస్తారు, ఆచరిస్తారు. కేసీఆర్కు ఈ రాష్ట్రం మీదున్న సంపూర్ణ అవగాహన.. మరొకరికి లేదని ఘంటాపథంగా చెప్పగలను.
తెలంగాణ భాషకు పట్టం
భాష విషయంలోనే చూడండి తెలంగాణ రాకముందు సినిమాల్లో తెలంగాణ భాష కమెడియన్లు, విలన్లకు పరిమితమైందా? లేదా? ఇప్పుడేమైంది. తెలంగాణ భాషలో సినిమాలు తీసినా.. పాటలు రాసినా వెండితెర వెలిగిపోతున్నది. ఆస్కార్లాంటి అవార్డులు తెలంగాణకు వచ్చి వాలుతున్నాయి.
ప్రజలకు బాగా తెలుసు
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని అంటున్నారు. ఈ రెండు పార్టీల నేపథ్యం.. ఆ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న శక్తులు? వారి వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాలను లోతుగా పరిశీలిస్తే తప్ప అర్థం కావు. రాష్ర్టాన్ని తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్, నాయకుడిగా కేసీఆర్ ఇటువైపు ఉన్నారు. అటువైపు ఉన్నదెవరు? తెలంగాణ పట్ల వారికి ఉన్న అవగాహన ఏమిటి? అన్నది నా కంటే ఎక్కువ ప్రజలకే తెలుసు.
…? నూర శ్రీనివాస్