హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ స్కూళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందజేయాలన్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే తక్షణమే వారి తల్లిదండ్రులకు తెలపాలని మంత్రి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని డీఎస్ఎస్ భవన్లో గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏ పీవోలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ ఏరియాల్లో చట్టాల అమలుపై దృష్టిసారించాలని చెప్పారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడం ప్రభుత్వం విద్యావ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో అనారోగ్యంతో ఒకరు, పురుగులమందు తాగి మరణించిన ఉదంతాలను మంత్రి తీవ్రంగా పరిగణించారు. విద్యార్థుల ఆరోగ్య, మానసిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు దృష్టిపెట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు సహా అన్ని సదుపాయాలను సత్వరమే కల్పించాలని ఆదేశించారు.
గిరివికాస పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అందుకు తక్షణమే కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంప్లు నిర్వహించాలని తెలిపారు. బీటీ రోడ్ల మరమ్మతులు చేయడంతో పాటు లింక్ రోడ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గిరిపోషణతో పాటు, కేసీఆర్ న్యూట్రిషన్, బాలామృతం ఆదివాసీలకు అందించాలని ఆదేశించారు. పోడు భూముల సమస్య ఎకడైనా తలెత్తితే వెంటనే పరిషార దిశగా కృషి చేయాలన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్, ట్రైకార్ జనరల్ మేనేజర్లు శంకర్రావు, లక్ష్మిపసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్ జీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.