మంచిర్యాల, జూన్ 15(నమస్తే తెలంగాణ): పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో నిర్మాణమవుతున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం చెన్నూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఒకేరోజు నాలుగు వంతెనలు ప్రారంభించడం, సుద్దాల వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. 20 ఏండ్ల ముందుచూపుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయ డం అభినందనీయమని చెప్పారు. ఎత్తిపోతల పథకానికి రూ.1,658 కోట్లు తీసుకొచ్చిన ఘనుడు బాల్క సుమన్ అని కొనియాడారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకొన్న రాష్ట్రంలో వెనుకబడిన చెన్నూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అందించే 3వేల ఇండ్లను నియోజక వర్గంలోని పేదలకు అందజేస్తామన్నారు.