హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) తిరుపతికి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రారంభించింది. రెండు రోజుల టూర్కు ఒక్కో వ్యక్తికి రూ.14,999 చార్జి చేయనున్నది. ప్యాకేజీలో భాగంగా తొలిరోజు ఉదయం 6 గంటలకు విమానం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అక్కడి నుంచి 8.45కు హోటల్కి వెళ్లి ఫ్రెష్ అయ్యాక ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలో తిరుమల స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శనం పూర్తయ్యాక ఆకాశగంగ, పాపవినాశనం, జాపాలి, శిలాతోరణం, శ్రీవారి పాదాలు మొదలైన ప్రదేశాల సైట్ సీయింగ్కు తీసుకువెళ్తారు. ప్రదేశాల సందర్శన సమయంలోనే మధ్యాహ్న భోజనం పెడతారు. అన్ని ప్రదేశాలు తిరిగాక రాత్రి 8 గంటలకు తిరిగి హోటల్కు చేరుకుంటారు. 8.30కు రాత్రి భోజనం ఏర్పాటుచేస్తారు. రెండోరోజు ఉదయం 7 గంటల నుం చి 10.30 మధ్యలో కాణిపాకం, 11 నుంచి 12.30 మధ్యలో శ్రీనివాసమంగాపురం తీసుకెళ్తారు. మధ్యా హ్నం ఒంటి గంటకు హోటల్కు వచ్చి భోజనం చేసి 2.30 నుంచి 3.30 మధ్యలో పద్మావతి ఆల యం, 4 నుంచి 5 గంటల మధ్యలో శ్రీకాళహస్తి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు తీసుకువచ్చి రెండోరోజు రాత్రి 9.30కు హైదరాబాద్కు చేరుకొనేలా ప్యాకేజీని రూపొందించారు. ఈ మేరకు ట్రూజెట్, స్పైస్జెట్తో ఒప్పందం చేసుకున్నామని టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా పేర్కొన్నారు.