హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 6 నుంచి 15 వరకు పది రోజులపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు, పరిశుభ్రత, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నది.
ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్కుమార్ బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. పది రోజుల కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ సెల్ను ఏర్పాటు చేయాలని, ప్రతిరోజూ పురోగతి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ‘6న ఉమ్మడి జిల్లా స్థాయిలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. మంచి పనితీరు కనబర్చిన కార్యాలయాలు, సంస్థలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పత్రాలు అందించాలని’ ఉత్తర్వులో ఆయన వెల్లడించారు.