Right to be forgotten | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు7(నమస్తే తెలంగాణ): ఓ వ్యక్తిపై నమోదైన ఎఫ్ఆర్ను కోర్టు కొట్టివేస్తే, అందుకు సంబంధించిన సమాచారాన్ని మీడియా సంస్థలు తొలగించాల్సి ఉంటుందని గత వారం గుజరాత్ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా ఆదేశించింది. క్రిమినల్ కేసులో వ్యక్తి నిర్దోషిగా తేలితే, సంబంధిత వ్యక్తి వార్తా కథనాలను తొలగించాల్సిందేనని తెలిపింది. రైట్ టు బి ఫర్గాటెన్ (వ్యక్తులకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు, న్యూస్ వెబ్ సైట్ల నుంచి చెరిపివేయడం, తొలగించటం) ప్రాముఖ్యాన్ని కోర్టు తన తీర్పు ద్వారా వ్యక్తపరిచింది. సమాచార గోప్యత.. వ్యక్తిగత గోప్యతలో భాగమేనని ఇదివరకే సుప్రీంకోర్టు కూడా స్పష్టంచేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ డాటా ప్రొటెక్షన్ బిల్లులో రైట్ టు బి ఫర్గాటెన్పై ప్రత్యేక క్లాజును పొందుపరిచారు. తప్పుడు సమాచారం సవరణ, తొలగించే హక్కును కల్పిస్తూ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. బిల్లులోని సెక్షన్ 12 ప్రకారం.. ఎవరైనా తమ వ్యక్తిగత సమాచారం వినియోగించుకునేందుకు ఏదైనా సంస్థకు ఇంతకుముందు అనుమతి ఇచ్చినట్టయితే, ఆ సమాచారంలోని తప్పులను సవరించేందుకు, అప్డేట్ చేసేందుకు, సమాచారం తొలగించాలని కోరేందుకు హక్కు ఉంటుంది. సదరు సంస్థలు ఆ మేరకు సమాచారాన్ని అప్డేట్/తొలగించడం చేయాలి.
డాటా సేకరణకు అనుమతి తప్పనిసరి
వ్యక్తిగత సమాచార భద్రత కోసం కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సేకరించాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ యూజర్ల డాటా గోప్యతను కాపాడ లేకపోయినా, ఆ సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. ఈ చట్టం అమలు కోసం డాటా ప్రొటెక్షన్ బోర్టు ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేస్తారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రెఫరెన్స్తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసే అధికారం ఉంటుంది. సంస్థలు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని ఏ అవసరాల కోసం సేకరించాయో ఆ అవసరాలకు మాత్రమే వాడాలి. అవసరం లేకపోతే సమాచారాన్ని నిల్వ చేయకూడదు.