హైదరాబాద్ : మేడారం జాతరకు రవాణా సౌకర్యాలు, ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, రవాణా శాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం మహాజాతర కొనసాగనుందని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించారు. ఈ నెల 16 నుంచి హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్ డిపో-1 బస్సులు ఎంజీబీఎస్ నుంచి బయల్దేరుతాయని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్-2 డిపో బస్సులు, ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పికెట్ డిపో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. మేడారం నుంచి హైదరాబాద్కు మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతాయని పేర్కొన్నారు. ఆర్టీసీ వెబ్సైట్, యాప్లో టికెట్ల బుకింగ్కు అవకాశం కల్పించినట్లు మంత్రి అజయ్ స్పష్టం చేశారు. మేడారం జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సులకు రూ. 398 ఛార్జీ వసూలు చేయనున్నారు.