శ్రీశైలం : శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలం (Srisailam) ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి ( Chakrapani Reddy) తెలిపారు. గురువారం ఆలయ సభ్యులతో కలిసి ఆలయ క్యూలైన్లు, సిద్ధిరామప్ప కాంప్లెక్స్, గణేశ సదనాన్ని పరిశీలించారు. శ్రావణమాసంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారని వెల్లడించారు .
భక్తుల (Devotees) రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. క్యూకాంప్లెక్స్లో అల్పహారం, మంచినీటిని అందిస్తుండాలని పేర్కొన్నారు. ఆలయ దర్శనవేళలు, యాత్రికులకు సూచనలను ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా తెలియజేయాలన్నారు. ఆర్జితసేవా కౌంటర్ల ముందుభాగంలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల (Quelines) ను ఆధునీకరించాలని సూచించారు. ఆర్జితసేవాకర్తలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
సిద్ధిరామప్ప సముదాయం రెండవ అంతస్తులో నిరుపయోగంగా ఉ్న దుకాణాలను భక్తుల కోసం సూట్గదులుగా మార్పు చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వాణిజ్య సముదాయ సమీపంలో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి అంతస్తులో సూపర్మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
గణేశ్ సదన్ ల్యాండ్ స్కేపింగ్ పనులను , మల్లమ్మ కన్నీరు సమీపంలో వాహనాల పార్కింగ్, కర్ణాటక ప్రభుత్వ అతిథి గృహానికి సంబంధించిన స్థలాలను వారు పరిశీలించారు. ఆయన పాటు ఆలయ కమిటీ సభ్యులు మేరాజోత్ హనుమంత్ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, ఏఈలు రామకృష్ణ, మురళీధరరెడ్డి, డీఈఈలు చంద్రశేఖర శాస్త్రి తదితరులు ఉన్నారు.