హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్చిట్ ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు నవ్వుల పాలవుతున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు.
బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి తీర్పులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. స్పీకర్ తీర్పుపై అన్ని అవకాశాలను ఉపయోగించి, జ్యుడీషియల్ రివ్యూకు వెళ్తామని స్పష్టంచేశారు. ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడుతానని చెప్పారు. కాంగ్రెస్ నేతలు స్పీకర్పై చాలా ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయల చేసిన అభ్యంతర వ్యాఖ్యలను కేఆర్ సురేశ్రెడ్డి ఖండించారు. తెలంగాణ వచ్చి..12 ఏండ్లు దాటినా ఇంకా తమపై ఆంధ్రా నేతల్లో కోపం కనిపిస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటు అప్రజాస్వామికం ఎలా? అవుతుందని నిలదీశారు. దీని వెనుక కుట్ర ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతున్నదని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తున్నదని చెప్పతారు.
జనగామ, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్కు శాసనసభ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం దారుణమని.. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బుధవారం జనగామలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి, కాంగ్రెస్లో చేరి ఎంపీగా పోటీ చేసిన తన కుమార్తె తరపున పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేసిన ఎమ్మెల్యే కడియంకు క్లీన్చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమే అని చెప్పారు.
అసెంబ్లీ స్పీకర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని..ఇది కేవలం ఒక తీర్పు కాదని.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడమేనని దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థ, చట్టాలపై బీఆర్ఎస్కు విశ్వాసం ఉందని.. బీఆర్ఎస్ పార్టీ అన్ని ఆధారాలతో న్యాయపరంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోవడం ఖాయమని చెప్పారు.