నిజామాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో నిజామాబాద్లో రెండు రోజులపాటు నిర్వహించిన ఆటో షో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఆదివారం ముగింపు కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. సాధారణంగా పంచెకట్టులో ఉండే పోచారం.. జీన్స్ ప్యాంట్ ధరించి ఆటో షోకు హాజరయ్యారు. స్వయంగా బుల్లెట్ బండి నడిపి, ఆటో షో ప్రాంగణంలో చక్కర్లు కొట్టి అందరి చేత చప్పట్లు కొట్టించారు. వాహనాలను కొనుగోలు చేసిన వారి నుంచి, సందర్శకుల నుంచి లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం ప్రసంగిస్తూ.. ఆటోషో నిర్వహణలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల చొరవను ప్రత్యేకంగా అభినందించారు. బైక్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
నోర్లకు స్పీడ్ బ్రేకర్ అవసరం
రాజకీయాల్లో కొంతమంది నోర్లకు స్పీడ్ బ్రేక్ ఉండటం లేదని పోచారం చురకలేశారు. బ్రేక్ లేని వాహనాలు బోల్తా కొట్టినట్టే.. బ్రేకుల్లేని నోర్లకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మాట్లాడినా, డ్రైవ్ చేసినా నిబంధనలు పాటించాలని సూచించారు. తన 46 ఏండ్ల రా జకీయ జీవితంలో తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని తెలిపారు. వ్యక్తిగతంగా విమర్శిస్తే.. మనకు, రౌడీలకు తేడా ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రజాసేవలో పోటీ పడాలి తప్ప బూతులు, తిట్ల దండకం మంచిదికాదని హితవు చెప్పారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, మేయర్ నీతూకిరణ్, కామారెడ్డి రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, సుజీత్సింగ్ ఠాకూర్, సిర్ప రాజు, ఆకుల శ్రీశైలం, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మా రమేశ్, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ప్రకటన విభాగం మేనేజర్ శ్రీకాంత్, సర్క్యులేషన్ ఏసీఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు.
4 లక్షల కి.మీ. బైక్ నడిపా
రాజకీయాలకు రాకముందు తనకు 1969లోనే మోటర్ సైకిల్ ఉండేదని, దానిపై కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలను చుట్టేసి వచ్చానని స్పీకర్ పోచారం పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. బుల్లెట్పై దాదాపు 4 లక్షల కిలోమీటర్లు డ్రైవ్ చేసినట్టు వెల్లడించారు. 1994లో ఎమ్మెల్యే అయ్యేంత వరకు తన వాహనం తానే నడిపానని, ఎప్పుడూ చిన్న యాక్సిడెంట్ కూడా జరుగలేదని చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది యు వకులు మరణిస్తున్నారని, గ్రామాల్లో ఆస రా పింఛన్ల కన్నా వితంతు పింఛన్ల సంఖ్య పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.