బాన్సువాడ(కామారెడ్డి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలకు గురైతే ఆ బాధ వర్ణించలేమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam Srinivas Reddy) అన్నారు. ప్రభుత్వ ఆలోచన మేరకు రైతులు పంటకాలాన్ని ముందుకు జరుపుకుంటే అనేక రకాలుగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో బాన్సువాడ నియోజకవర్గ స్థాయి రైతు అవగాహన సదస్సు(Farmers Awareness Camp)లో స్పీకర్ మాట్లాడారు.
పంటకాలాన్ని ముందుకు జరపడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ‘నవంబర్ నెలలో వచ్చే తుఫాన్లు, ఏప్రిల్ నెలలో కురిసే వడగండ్లు రైతులకు జీవన్మరణ సమస్యలను సృష్టిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను(Natural Calamities) తప్పించలేం. కానీ పంట కాలాన్ని ముందుకు జరుపుకోవడం మన చేతిలో పని. తద్వారా పంటలను కాపాడుకోవచ్చని ’ సూచించారు.
వానాకాలం పంటల సాగుకు మే నెల చివర్లో రోహిణి కార్తెలోనే నార్లు పోసుకోవాలని, నార్లు పోసిన నెల లోపు నాట్లు వేసుకోవాలన్నారు. 125 నుంచి 130 రోజుల్లో పంట చేతికి వస్తుందని దీని వల్ల అక్టోబర్, నవంబర్ నెలలో వచ్చే తుఫాన్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చాన్నారు. ‘ యాసంగి కోసం నవంబర్ రెండో వారంలో నార్లు పోసుకోవడం ద్వారా ఏప్రిల్ నెలలో సంభవించే అకాల వర్షాలు, వడగండ్ల నుంచి తప్పించుకోవచ్చు. ముందస్తు నాటుతో చీడపీడలు తగ్గుతాయి, దిగుబడులు పెరుగుతాయని’ వెల్లడించారు.
రైతులు కోరితే నార్లు పోసుకోవడానికి నిజాంసాగర్ కాలువల క్రింద నీళ్లను అందిస్తామని, నిజాంసాగర్(Nizam Sagar) లో కావలసినన్ని నీళ్లు ఉన్నాయి. అవసరమైతే కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project ) ద్వారా గోదావరి నీళ్ళు తెచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నష్టం వస్తున్నా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో పంటల ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతుకు భరోసా కల్పిస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో పంటల ఉత్పత్తులను కొనే దిక్కు లేదు. తెలంగాణ రాష్ట్రం మాత్రమే మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని వివరించారు.
ఈ సదస్సులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి , నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు, కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.