బాన్సువాడ ( కామారెడ్డి) : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam Srinivas reddy) అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం అత్యధికంగా నిధులను మంజూరు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ గ్రామీణ మండలం కొల్లూరు గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పారిశుధ్య కార్మికులను సన్మానించి మాట్లాడారు.
2004 నుంచి 2014 వరకు గత ప్రభుత్వాలు గ్రామాలలో మౌలిక వసతుల(Basic needs) కోసం రూ. 12,000 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలలో రూ.58,000 కోట్లు ఖర్చుచేసిందని వెల్లడించారు. తాగునీటి (Drinking Water)కోసం రూ. 36,000 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి తాగునీరు అందిస్తుందని పేర్కొన్నారు.బ్రిడ్జిల నిర్మాణం రూ. 9,797 కోట్లు , సీసీ రోడ్లకు రూ. 2,310 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నీళ్ల సరఫరా కోసం ట్యాంకర్ ఇచ్చామని ఆయన అన్నారు.పల్లె దవాఖానల ఏర్పాటుతో వైద్యాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రజల ముంగిట తీసుకొచ్చామని పేర్కొన్నారు.
ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పింఛన్లు అందిస్తున్నామని స్పీకర్ వివరించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి(Kalyana Laxmi), షాదీముబారక్ పథకం ద్వారా నగదు సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. గుజరాత్ లో మాదిరిగా మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తుండగా తెలంగాణలో కూడా మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం సూచిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ఒప్పుకోలేదన్నారు. గొంతులో ప్రాణం ఉండగా ఒప్పుకోనని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని స్పీకర్ గుర్తు చేశారు.
కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram) ద్వారా గోదావరి నీరు నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్నాయని తెలిపారు. కొల్లూరు గ్రామంలో అదనపు తరగతి గదులను స్పీకర్ పోచారం ప్రారంభించారు. సిసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, నాగారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, ముదిరాజ్ సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, బాన్సువాడ ఆర్డీవో రాజా గౌడ్, డీఎస్పీ జగన్నాధ రెడ్డి, మండలాధ్యక్షురాలు దొడ్ల నీరజావెంకట్రాంరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.