కామారెడ్డి : ఆర్టీసీని(RTC) ని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయం. 43,000 మంది కార్మికులకు ఇదో శుభవార్త. వారి 50 సంవత్సరాల కల నెరవేరింది. మీరు ఇప్పుడు కార్మికులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు అని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసినందుకు గాను బాన్సువాడ RTC ఉద్యోగులు, సిబ్బంది స్పీకర్ నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..క్యాబినెట్ నిర్ణయం తదుపరి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. త్వరలోనే ఇది చట్టంగా మారుతుందన్నారు. సంస్థ ఉద్యోగులు ప్రయాణికులకు మెరుగైన సేవలను, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ పరిపాలన దేశానికే ఆదర్శంగా ఉన్నది. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ను మించిన వారు ఎవరూ లేరని ప్రశంసించారు. ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి పదవి కోసం తన్నుకోవడమే సరిపోతుంది. తెలంగాణ గురించి ఆలోచించే తీరిక వారికి ఉండదన్నారు. తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాలలో ఎందుకు లేవని ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారు.
తమకు కూడా కేసీఆర్ వంటి నేత కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. గత ఐదేండ్లలో బాన్సువాడ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.