బాన్సువాడ, ఫిబ్రవరి 25 : కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని, ఫలితంగా గతంలో వలస వెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు వాపస్ వచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో శనివారం నిర్వహించిన కురుమ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నిజాంసాగర్లోకి కాళేశ్వరం జలాల తరలింపు, 24 గంటల ఉచిత విద్యుత్తు, పెట్టుబడి సాయం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించడం తదితర పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని అన్నారు. రైతులు అప్పుల బాధ నుంచి బయటపడి, ఆత్మహత్యలు లేకుండా బతుకున్నారంటే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కారణమని తెలిపారు. సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తుండటంతో ఎంతో మంది ఆర్థికంగా ఎదుగుతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టలేదని చెప్పారు. ఇక్కడ ప్రవేశపెట్టిన పథకాలు చూసి ఇతర రాష్ర్టాల వారు తమను తెలంగాణలో కలుపుకోవాలని స్థానిక నాయకులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలుకావడం లేదని ఆయన ప్రశ్నించారు.