బాన్సువాడ, ఫిబ్రవరి 5 : తనకు కబడ్టీ అంటే ఎంతో ఇష్టమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియంలో దివంగత పరిగె పాపమ్మ, రాజారెడ్డి స్మారకార్థం తన సోదరుడు శంభురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రో కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ఉన్నా కబడ్డీపై మక్కువతో బాన్సువాడకు వచ్చినట్టు తెలిపారు. బాన్సువాడ స్టేడియంలో కబడ్డీ మ్యాట్, రెజ్లింగ్ మ్యాట్, బ్యాడ్మింటన్ మ్యాట్తో పాటు, 3 ఆర్చరీలను సీఎం కేసీఆర్ ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రూ.10 లక్షలతో అందిస్తామని తెలిపారు. క్రీడల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. అనంతరం పోలీస్ ఫైటర్స్, బొల్లారం జట్ల మధ్య ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ను ఆసక్తిగా తిలకించారు. విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ నేత పోచా రం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.