తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. 2022, సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో ఆదివారం టెలీఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్టాడారు. ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ 8వ సెషన్ మూడో సమావేశాలు, శాసనమండలి 18వ సెషన్ మూడో సమావేశాలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. గత సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించిన అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు గత సమావేశాల్లో మాదిరిగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు.
గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని స్పీకర్ పోచారం సూచించారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని కోరారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అందించాలన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలన్నారు. స్థానిక శాసనసభ్యుడికి ముందస్తుగా సమాచారం అందించాలన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘన చేయకుండా రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపాలని సూచించారు. శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం తరఫున అందించాలన్నారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ.. ఎవరికైనా లక్షణాలుంటే నిర్ధారణ చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ డిస్పెన్సరీలో కరోనా టెస్టింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన సభ్యులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలన్నారు.
గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత సమర్ధవంతమైనదని పేర్కొన్నారు. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలన్నారు. గతంలోని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఈ సారి అలాగే జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వీ నరసింహా చార్యులు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏ అండ్ యూడీ) అరవిందరావు, సెక్రటరీ (జీఏడీ) శేషాద్రి, హెల్త్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, డీజీపీ ఎం. మహేందర్రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.