నిజాంసాగర్, జూలై 29: సీఎం కేసీఆర్ హయాం లోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని, అందుకే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకులు అనాలోచిత ఆరోపణలు చేస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాలనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. భారీ వర్షాలు కురిసి ఇబ్బందులు ఎదురైనా ప్రాణ నష్టం జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. శనివారం ఆయన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. వరద గేట్ల ద్వారా విడుదలవుతున్న నీటిని పరిశీలించిన ఆయన.. గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం సభాపతి మీడియాతో మాట్లాడారు.
ప్రపంచంలోనే తొలి భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన నిజాంసాగర్ జలకళను సంతరించుకున్నదని చెప్పారు. ప్రస్తుత వానకాలంతోపాటు వచ్చే యాసంగి పంటలకు ఆయకట్టుకు భరోసా ఏర్పడిందని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులన్నీ పూర్తికావడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందన్న స్పీకర్.. కౌరవుల పరిపాలనలో కరువు ఏర్పడిందని, ప్రస్తుతం పాండవుల పరిపాలన కొనసాగుతుందనే దానికి ఇదే నిదర్శనమని మహాభారతం కథను చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టును తిలకించేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్ రానున్నారని చెప్పారు.