నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఉందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. జిల్లాలోని కోటగిరి మండలం ఎతొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. 2014 న తెలంగాణ రాష్ట్రం వచ్చే రోజుకి 34 లక్షల ఎకరాలలో వరి సాగు ఉండగా నేడు అది 1.04 కోట్లకు పెరిగింది.
దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలేనని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి ఉచితంగా24 గంటల కరంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 30 లక్షల బోరు బావులు ఉన్నాయి. రాష్ట్రంలో కరంట్ కష్టాలు లేకుండా చేశామని స్పీకర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి కొరత లేకుండా ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను పటిష్ట పరిచాం.
కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద ఇరవై వేల కోట్ల రూపాయలతో పూడిక తీయించి పటిష్టంగా చేయించామన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఆహార ధాన్యాలను రైతుల నుంచి సేకరించి FCI ద్వారా అవసరమైన ప్రాంతాలలోని ప్రజలకు సరఫరా చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకుందని ఆరోపించారు. రైతులు మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యం కొనుగోళ్లను చేపట్టిందన్నారు.