కామారెడ్డి : బాన్సువాడ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తులో నర్సింగ్ కాలేజీ విద్యార్థినుల కోసం తాత్కాలికంగా వసతి గృహన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం స్థానిక ఆర్డీవో రాజాగౌడ్తో కలిసి అకస్మాత్తుగా వసతిగృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలో కలియ తిరుగుతూ సౌకర్యాలను గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
ఇక్కడ సదుపాయాలు బాగున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేవని విద్యార్థినులు తెలపడంతో స్పీకర్ పోచారం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణానికి రూ. 40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నెలలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. అన్ని వసతులతో నూతన భవనాన్ని త్వరగా నిర్మించి వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.అనంతరం విద్యార్థినులతో కలిసి స్పీకర్ టిఫిన్ చేశారు. ఆహారం బాగుందని ఇదే నాణ్యతను కొనసాగించాలని సూచించారు.