నిజామాబాద్ : గత పాలకుల చేతగానితనంతో దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam) అన్నారు. నదులలో లభ్యమయ్యే నీటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టులు నిర్మిస్తే కరువే ఉండదని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా చందూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా సోమవారం పైప్ లైన్ నిర్మాణ పనులను స్పీకర్ ప్రారంభించారు. అనంతరం వర్ని మండలం లోని జాకోర ఎత్తిపోతల పథకం(Lift Scheme) నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల కన్నీళ్లు తుడవడానికి, భూములకు సాగునీరు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సాగునీటి ప్రాజెక్టులను నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్నది నిజమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేకుండా ఆత్మగౌరవంతో బతికే రోజులు వస్తున్నాయని తెలిపారు.
రైతుల ఆలోచన కలిగిన వ్యక్తులే పరిపాలన చేస్తారని అలాంటి నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. మల్లన్న సాగర్(Mallanna sagar) నుంచి హల్ధీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి నీళ్ళు వస్తే ఇక పంటలకు డోకా లేదన్నారు. నిజాంసాగర్ 365 రోజులు నిండు కుండలా ఉంటుందని వివరించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో రెండు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట సాగునీటి శాఖ సీఈ శ్రీనివాస్, ఆర్డీవో రాజేశ్వర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ అధికారులు ఉన్నారు.