నల్లగొండ : రాష్ట్రంలో రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో వాడపల్లి ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ యస్.రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ లోని పలనాడు జిల్లా ఎస్పీ వై.రవి శంకర్ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, కోదాడ డీఎస్పి ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్తనపల్లి డీఎస్పీ ఆదినారాయణ, గురజాల డీఎస్పీ పల్లపురాజు, సంబంధిత సర్కిల్ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు.
ఎన్నికల నియమావళి పరిరక్షణే ధ్యేయంగా బార్డర్ పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ అపూర్వ రావు తెలిపారు. అంతరాష్ట్ర, అంతర్ జిల్లా పోలీస్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలక్షన్ల ముందు ఆ సమయంలో మద్యం, నగదు సరఫరా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, పాత దొంగలు, నేరస్తుల సంచారం కట్టడి, ఇంటలిజెన్స్ సమాచారం పంచుకోవడం తదితర అంశాలపై చర్చించారు.