ఖైరతాబాద్, ఆగస్టు 4 : లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వ్యాఖ్యా నించిన ఎంపీ సోయం బాపురావును బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు ఆ పార్టీ అధినాయకత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఈ నెల 6న నిర్వహించనున్న బీజేపీ కార్యాలయ ముట్టడి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణలో ఆదివాసీ, లంబాడీల మధ్య సోయం బాపురావు గొడవలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నాడని మండిపడ్డారు.
సోయం వ్యాఖ్యలు వ్యక్తిగతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చెప్పడం ఎంతవరకు సబబు అని, అతను బీజేపీ ప్రతినిధి, ఎంపీ కాదా? అని ప్రశ్నించారు. కిషన్రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత సోయం బాపురావు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని, దీనికి మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే లంబాడీల సత్తా చూపుతామని హెచ్చరించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎక్కడికక్కడ అడ్డగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు వెంకట్ బంజారా, గణేశ్నాయక్, మల్లేశ్నాయక్, దేవదాస్నాయక్, శివ నాయ క్, వినోద్ నాయక్, సరోజ బాయి, భరత్ నాయక్, రాము నాయక్ పాల్గొన్నారు.