Monsoon | తెలంగాణలో వర్షాలు ముఖం చాటేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలపైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైన విషయం తెలిసిందే. రాగల రెండురోజుల్లో రాష్ట్రాన్ని వీడనున్న రుతుపవనాలు.. ప్రస్తుతం రామగండం వరకు చేరుకున్నాయని పేర్కొంది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. మరో వైపు రుతుపవనాల తిరోగమనం నేపథ్యంలో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం చిత్తూరు, తిరుపతి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్లో రుతుపవనాల ప్రవేశం ఆలస్యమయ్యాయి. ఈ సారి తెలంగాణలోని 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వివరించింది.