హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: వానకాలం చివరలో వరుణుడు దంచి కొడుతున్నాడు. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్న వేళ తెలంగాణపై చురుకుగా ఉన్నాయి. ఫలితంగా రెండు రోజులుగా పలు జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో 12.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడగా, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రదేశం నుంచి తెలంగాణ, విదర్భల మీదుగా పశ్చిమ మధ్య ప్రదేశ్వరకు కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఈ నెల10 వరకు చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
హైదరాబాద్ నగర వాసులను వానలు వదలడం లేదు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మహేశ్వరంలో 10 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అమీర్పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, నారాయణగూడ, పాతబస్తీ, యాకుత్పురా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి.
బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో వాగులు పొంగిప్రవహించాయి. వికారాబాద్ జిల్లా తాండూర్, పెద్దేముల్, కుల్కచర్ల, ధారూర్ మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్ మండలం నాగారం చిన్నవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న దోర్నాల్ గ్రామానికి చెందిన దంపతులు చెట్టు కొమ్మ సహాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లపూర్ పెద్దవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దుందుభీ, ఊకచెట్టు వాగుల్లో వరద పెరిగింది.