ముడుమాల్/ నారాయణ పేట : చారిత్రాత్మక ముడుమాల్ నిలువురాళ్లకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు సాధించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు జై మక్తల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సందీప్ మక్తల్ చేస్తున్న కృషిలో కీలక ముందడుగు పడింది. సందీప్ మక్తల ఆహ్వానం మేరకు దక్షిణ కొరియాలోని సేజొంగ్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు సభ్యుల బృందం ముడుమాల్ను సందర్శించింది.
నిలువురాళ్లపై పరిశోధన చేస్తామని ప్రకటించిన ఈ బృందం వారసత్వ సంపద గుర్తింపు దక్కడంలో తమ వంతు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఖగోళ పరిజ్ఞానాన్ని గుర్తించే స్కైచార్ట్ ఆనాటి ఆదిమానవులు చారిత్మాత్మక ముడుమాల్ నిలువురాళ్లలో ఏర్పాటు చేశారు. అయితే, ముడుమాల్ నిలువుల్లో గొప్పతనాన్ని తెలుసుకున్న సందీప్ దీనికి యునెస్కో వారసత్వ హోదా సాధించే స్థాయి కలిగి ఉందనే విషయాన్ని గుర్తించారు.
ముడుమాల్ గురించి అవగతం చేసుకున్న సందీప్ ఈ మేరకు స్థానికులకు అవగాహన కల్పించే ప్రయత్నం మొదలుపెట్టారు. సందీప్ మక్తల ఆహ్వానం మేరకు ఆదివారం దక్షిణ కొరియాకు చెందిన గ్వాంగ్జిన్ ప్రావిన్స్ సేజోంగ్ యూనివర్సిటీ పరిశోధన బృందం నిలువురాళ్లను సందర్శించింది.
కొరియాకు చెందిన పరిశోధన విద్యార్థులు కిమ్ షెంగ్షుక్, కిమ్ యోంగ్జీ, బీ ఇన్ హో, లీషామీ, ఈగ్జీయోంగ్, జియాంగ్ హు ఆదివారం సందర్శించారు. సందీప్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్ను తిలకించి నిలువురాళ్ల విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సేజోంగ్ యూనివర్సిటీ పరిశోధన బృందం మాట్లాడుతూ.. ముడుమాల్ నిలువురాళ్ల సందర్శన తమకు ఎంతో థ్రిల్లింగ్ అనుభూతి కలిగించిందన్నారు.
3,500 సంవత్సరాల క్రితం ఇంత గొప్ప ఆవిష్కరణ జరగడం అద్భుతమని పేర్కొంటూ నిలువురాళ్లపై పరిశోధన చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సందీప్ మక్తల మాట్లాడుతూ..అంతర్జాతీయంగా వివిధ వేదికలతో కలిసి నిలువురాళ్లకు యునెస్కో వారసత్వ హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.