Ayodhya | ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయుల కల సాకారమైంది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయోధ్యకు చేరుకునేందుకు ఉన్న మార్గాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో రామయ్య భక్తులకు భారతీయ రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజ మహేంద్రవరం, సామర్లకోట్ల నుంచి అయోధ్యకు దక్షిణ మధ్య రైల్వే నడుపనున్నది.
విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ల మీదుగా అయోధ్యకు రైళ్లు వెళ్లనున్నాయి. తెలంగాణ నుంచి సికింద్రాబాద్, కాజీపేట నుంచి అయోధ్యకు రైళ్లు వెళ్లనున్నాయి. సికింద్రాబాద్ నుంచి జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బల్హర్షా తదితర ప్రాంతాల మీదుగా రైళ్లు రాపోకలు సాగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి ఈ నెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో రైలు నడువనున్నది.
ఆయా రోజుల్లో రైలు సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి వెళ్తుంది. అయోధ్య నుంచి ఈ నెల 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఆయా రోజుల్లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏపీలో గుంటూరు నుంచి ఈ నెల 31న, విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, రాజమండ్రి నుంచి ఫిబ్రవరి 7న, సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయోధ్యకు వెళ్లాలనుకునే ప్రయాణికులు రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది.