హైదరాబాద్ : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన చిలుకూరి బాలాజీ (Chilukuri Balaji ) దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందరరాజన్ ( Soundararajan ) మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) సంతాపం ప్రకటించారు. సామాజిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ, తనదైన శైలిలో దైవ సేవ చేయడం ద్వారా, సౌందరరాజన్ ‘ప్రజా పూజారి’ గా ప్రసిద్ధి గాంచారని అన్నారు.
ప్రజా జీవనంలో భాగమైన హిందూ మత సాంప్రదాయ విలువలను విశదీకరిస్తూ, సమానత్వ భావనతో ప్రజలకు ఆధ్యాత్మిక సేవను అందిస్తూ, స్వామి భక్తులతో పాటు సభ్య సమాజ గౌరవాన్ని పొందిన అరుదైన పూజారి సౌందరరాజన్ అని కొనియాడారు. వారు అనుసరించిన ఆధ్యాత్మిక విధానాలు భవిష్యత్లో అర్చక సేవను వృత్తిగా ఎంచుకునే యువతకు ఆదర్శనీయమని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆయన మరణం హిందూ ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. సౌందరరాజన్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు, భక్తులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.