IPS Soumya Mishra | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారిణి సౌమ్య మిశ్రా పేరు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఆమెకున్న ప్రత్యేక గుర్తింపే ఇందుకు ప్రధాన కారణం. నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిపేందుకు సౌమ్య మిశ్రా తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆమెకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ నిందితులను అరెస్టు చేయడం, మానవ అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకోవడం, స్పెషల్ డ్రైవ్లతో చి న్నారులను అక్రమ రవాణా నుంచి కాపాడటం సహా పలు విషయాల్లో ఆమె తనదైన ముద్ర వేశారు. పోలీసు శాఖకు అందించిన సేవలకు గుర్తింపుగా గతంలో అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు, మెడల్స్ అందుకున్న సౌమ్య మిశ్రాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపిక చేసింది.
ఆరంభం నుంచే విశిష్ట సేవలు
1994లో ఐపీఎస్ బ్యాచ్ నుంచి కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టిన సౌమ్య మిశ్రా తన కెరీర్లో 20 మంది నక్సల్స్ను హతమార్చారు. 24 మంది టాప్ క్యాడర్ మావోయిస్టులు, 30 మంది ఇతర క్యాడర్ నాయకులు, 42 మంది వామపక్ష తీవ్రవాదులను అరెస్టు చేయడంతోపాటు ఆయుధాలు, నగదుతో కూడిన 77 డంప్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె చేపట్టిన చర్యల వల్ల వరంగల్లో 30, విజయనగరంలో 11, విశాఖపట్నంలో 71 మంది నక్సల్స్ లొంగిపోయారు.
ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో 62 మంది నిందితులను అరెస్టు చేసిన సౌమ్య మిశ్రా.. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 80 మందిని అరెస్టు చేసి బంగ్లాదేశ్కు చెందిన 81 మంది యువతులను రక్షించారు. స్పెషల్ డ్రైవ్ల ద్వారా 9,125 మంది చిన్నారులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు. 2004లో ఆంత్రిక్ సురక్షా సేవా పతక్, 2013లో ఇండియన్ పోలీస్ మెడల్, 2018 లో టెక్నాలజీ సభ అవార్డు, 2019లో ఇన్ఫో కం ఇండియా అవార్డు, 2021లో డీజీ ఫైర్ సర్వీసెస్ అవార్డు (ఒడిశా), 2022లో డీజీ కమెండేషన్ (భారత ప్రభుత్వం) అవార్డు, 2023లో అతి ఉత్కృష్ట్ అవార్డు కైవసం చేసుకున్న సౌమ్య మిశ్రాను ఈ ఏడాది రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం వరించింది.