మద్దూరు (ధూళిమిట్ట), జనవరి 18: తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు జీవితాంతం అందుబాటులో ఉంటానని బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండ లం దుబ్బతండా పంచాయతీ పరిధిలోని చెలిమెతండాను బుధవారం ఆయన సందర్శించారు. చెలిమెతండాలో అభిమానులు నిర్మించిన తన ఆలయాన్ని సందర్శించి అందులోని విగ్రహాన్ని చూసి మురిసిపోయారు.
కరోనా, లాక్డౌన్ సమయంలో చెలిమెతండాలో తనకు ఆలయాన్ని నిర్మించారని తెలుసుకొని వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చినట్టు సోనూసూద్ పేర్కొన్నారు. తనకు రాజకీయాలతో పని లేదని, ప్రజల అభిమానం ఉంటే సరిపోతుందని తెలిపారు. ‘నన్ను దైవంలా చూడొద్దు. నేనూ మీలాగే మనిషిని. మీరు చూపిన అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటా’నని అన్నారు. చెలిమెతండా ప్రజలకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. త్వరలోనే స్థానికులతో సమావేశమై గ్రామాభివృద్ధికి కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు.