మహబూబ్నగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్లో అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు యత్నిస్తున్నాయి. ఫ్యాక్టరీపై కట్టుకథలు అల్లడం ప్రారంభించాయి. దేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్సెల్ బ్యాటరీ తయారీకి అమరరాజా కంపెనీ రూ.10 వేల కోట్ల పెట్టుబడితో ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న విషయం విదితమే. కంపెనీని పాలమూరు జిల్లా దివిటిపల్లి ఇండస్ట్రీయల్ పార్కులో పెట్టమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. కంపెనీ రాకతో జిల్లా స్వరూపమే మారుతుందని ప్రభుత్వం భావిస్తుంటే.. విపక్షాలు మాత్రం కాలుష్యం వెదజల్లుతుంది. పచ్చని పల్లెలు ఖతం అవుతాయని భయాలు పుట్టిస్తున్నాయి. దేశం కాని దేశంలో జర్మనీలో స్థిరపడ్డ ఉమ్మడి జిల్లా యువకులు బ్యాటరీ ఫ్యాక్టరీపై ఆసక్తిగా తమ జిల్లాలో అంత పెద్ద ఫ్యాక్టరీ వస్తుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కంపెనీ ఏర్పాటును అడ్డుకునే కుట్ర జరుగుతుండటం గమనార్హం.
లిథియం కంపెనీ వస్తే కాలుష్యం వస్తుందా..? లేదా..? అని నిజనిజాలు పరిశీలించేందుకు దివిటిపల్లి, ఎదిర, అంబట్పల్లితోపాటు సమీప గ్రామాలకు చెందిన దాదాపు వంద మందిని ఇటీవల ఏపీలోని రేణిగుంటకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పంపించారు. వీరు అక్కడ ఉన్న బ్యాటరీ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని స్వయంగా పరిశీలించింది. పరిసరాల్లోని పల్లెలన్నీ పచ్చగా ఉన్నాయని బృంద సభ్యులు గ్రహించారు. బ్యాటరీ ఫ్యాక్టరీని కళ్లారా చూసిన జనం గ్రామాల్లో దీనిపై విస్తృత చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ రాకుంటే బతుకు కష్టమవుతుందని, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు.