హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమా భరత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. లాలాపేటలోని విజయ డెయిరీ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ భరత్ కుమార్ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.