చేర్యాల : భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి ’ పథకం ఎంతో మందికి ప్రయోజనకరంగా మారిందని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో రెవెన్యూ విభాగం పై ఆయన మాట్లాడారు. రెవెన్యూ అంటే ఒకప్పుడు మాల్గుజారీ, ఉమర్ గుజారీగా ఉండేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పక్కగా ఆలోచన చేసి సమస్యలు తొలగించేందుకు రికార్డుల ప్రక్షాళన చేసినట్లు వివరించారు.
ధరణి వల్ల 96శాతం భూ సమస్యలు పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. భూ సమస్యలు పరిష్కారం కావడంతో 65 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు పడుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు ధనవంతులు అర్బన్ ఏరియాలో ఉండే వారని సీఎం కేసీఆర్ ధరణి తీసుకురావడంతో ప్రజలు గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాలవద్ద ఫాంహౌజ్లు నిర్మించుకుంటున్నారని వివరించారు.
గతంలో డబ్బులు పెట్టి భూములు కొనుగోలు చేసిన వారు మ్యుటేషన్, వారసుల సంతకాల వల్ల ఇబ్బందులు ఏర్పడేవని ఇప్పుడు అలాంటి సమస్యలు లేవన్నారు. భూ సమస్యలు దాదాపు పరిష్కారం కావడంతో అర్బన్ ఏరియాలో ఉన్న ధనవంతులు గ్రామాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారని, దీంతో గ్రామాల్లో భూముల ధరలు పెరిగి సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.