హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమవారం రాష్ట్ర స్త్రీ, శిశు, వృద్ధుల సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్కు వీజేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ నుంచి దివ్యాంగులశాఖను వేరుచేయాలని, షరతులు లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వాలని, ఉపకరణాలను అందజేయాలని కోరారు. దివ్యాంగుల సమస్యలపై దివ్యాదేవరాజన్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో వీజేఏసీ చైర్మన్ సతీశ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు వీరయ్య, లక్ష్మయ్య, అడివయ్య, వెంకట్, మేకల సమ్మయ్య పాల్గొన్నారు.