హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లకు జన్యు సవరణతో చెక్ పెట్టవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నా రు. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, బయోటెక్ కన్సార్టియం ఇండియా లిమిటెడ్ నిర్వహణలో ‘జీనోమ్ ఎడిటింగ్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ పొటెన్షియల్ అండ్ పాలసీ’ అంశంపై రాజేంద్రనగర్లోని వర్సిటీలో శుక్రవారం వర్క్షాప్ జరిగింది. శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్న ఈ వర్క్షాప్లో బయోటెక్ చీఫ్ జనరల్ మేనేజర్ విభా అహుజా మాట్లాడుతూ.. చైనా, అమెరికా వంటి దేశాలు జీనోమ్ ఎడిటింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాయని, భారత ప్రభుత్వం కూడా దీనిపై పరిశోధనలు ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా మొదట జయశంకర్ వర్సిటీలోనే ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ డైరెక్టర్ ఆర్ఎం సుంద రం మాట్లాడుతూ.. జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీని ఇప్పటికే 25 దేశాల్లో 40 పంటల్లో వినియోగిస్తున్నారని వెల్లడించారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఈ నూతన టెక్నాలజీతో పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు. నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచుకోవచ్చని వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటానికి, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించటానికి కొత్త టెక్నాలజీలు సాయపడుతాయని రాష్ట్ర వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతు అన్నా రు. సామాన్యులకు ఉపయోగపడే ఏ టెక్నాలజీనైనా స్వాగతించాలని సీఎం కేసీఆర్ చెప్తుంటారని వర్సిటీ వీసీ ప్రవీణ్రావు అన్నారు. వర్క్షాప్లో భాగంగా రాశి సీడ్స్, జయశంకర్ వర్సిటీ మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది.