హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): పేద, మధ్యతరగతి ప్రజలు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలకుతోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతుగా అదనపు సబ్సిడీలు అందించాలని తెలంగాణ రాష్ట్ర సోలార్ ఎనర్జీ అసోసియేషన్ విజ్ఞప్తిచేసింది. దీనివల్ల లబ్దిదారులపై ఆర్థికభారం తగ్గి, సోలార్ విద్యుత్తు వినియోగాన్ని పెంచే అవకాశం ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. పలు రాష్ర్టాలు సబ్సిడీలు అందిస్తున్నాయని, తెలంగాణలో కూడా గతంలో అదనపు సబ్సిడీని మంజూరు చేశారని ఆయన గుర్తుచేశారు. గతంలో మాదిరిగా టెండర్లను ఆహ్వానించి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ద్వారా సోలార్ విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తిచేశారు. పరిశ్రమలు, పెద్ద సంస్థలు తమ సొంత అవసరాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్లాంట్ల ద్వారా ఐదు మెగావాట్ల వరకు(క్యాప్టివ్ పవర్) స్వయంగా ఉత్పత్తి చేసుకొని వాడుకోవడానికి అనుమతులను మంజూరు చేయాలని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచించారు.