హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): కరోనా ఉధృతి సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం పద్ధతికే ఐటీ ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. బలవంతంగా ఆఫీస్కు రావాల్సిందేనని కంపెనీ ఆదేశిస్తే రాజీనామా చేస్తున్నారు. ఈ ఒరవడి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నది. పాశ్చాత్యదేశాల్లో గ్రేట్ రిజిగ్నేషన్ గత నవంబర్ నుంచి ఉద్యమంలా కొనసాగుతున్నది. వేతనాలు పెంచకపోవడంతోపాటు, ఆఫీస్ నుంచి పనిచేయాలనే ఒత్తిడి దీనికి కారణం. దీంతో ఐటీ కంపెనీలు వర్క్ ఎట్ లొకేషన్ డిమాండ్పై వెనక్కి తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ సంస్థ బడ్జెట్ను రెండింతలు చేయనున్నదని, ఉద్యోగులకు స్టాక్స్ కేటాయింపుల్లో కనీసం 25 శాతం వృద్ధి, ప్రతిభ ఆధారంగా వేతనాలు పెంచుతామని కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ప్రతిభ ఆధారంగానే జీతాలు పెరుగుతాయని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో నాదెళ్ల స్పష్టం చేసినట్టు గీక్వైర్ నివేదిక పేర్కొన్నది.
ఎక్కువ పని గంటలు
రెండేండ్లుగా హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులు కొన్ని గంటలు ఎక్కువగానే పనిచేస్తున్నారు. దీంతో కంపెనీలు సైతం లాభాలు ఆర్జించటంతోపాటు కొత్త ప్రాజెక్టులను సొంతం చేసుకున్నాయి. కొన్ని కంపెనీల్లో ఉద్యోగులకు ఇక్రిమెంట్లు, ప్రత్యేక అలవెన్సులు.. ఇలా రకరకాలుగా ప్రోత్సాహకాలను ఐటీ కంపెనీలు ఇచ్చాయి. మొదట్లో ఇంటి నుంచి పనిచేయడం ఒత్తిడిగా భావించినా, క్రమంగా అలవాటైపోయింది. ఇప్పుడు హఠాత్తుగా ఆఫీస్కు రావాలని ఒత్తిడి చేస్తే, ఉద్యోగులు రాజీనామాకు సిద్ధపడుతున్నారు. మరో కంపెనీలో ఉద్యోగం వెతుక్కుంటామని తేల్చిచెప్తున్నారు.
హైబ్రిడ్ పద్ధతిలోనే సంతృప్తి
దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, ముంబై, ఢిల్లీ, గురుగావ్ ప్రాంతాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉదాహరణకు.. బెంగళూరులో ఉద్యోగం చేసే ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో సొంతూరైన రాష్ట్రంలోని వరంగల్ ఉంటూ పనిచేస్తున్నాడు. గత రెండు నెలలుగా ఐటీ కంపెనీలు లొకేషన్కు(కంపెనీ కార్యాలయానికి) వచ్చి పనిచేయాలని సూచించడంతో ఇతర నగరాల్లో ఉన్నవారు వెంటనే అక్కడికి వెళ్లి పనిచేయలేకపోతున్నారు. లొకేషన్కు వెళ్లాలంటే చాలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరంతో పాటు అదనంగా ఖర్చవుతున్నది. ఆఫీస్కు రావాలనటంతో రాజీనామా చేస్తున్నామని ఐటీ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
అవకాశాలు అపారం
కరోనా వల్ల ఐటీ రంగంలో అపారమైన అవకాశాలు ఉద్యోగుల ముంగిటకు వచ్చాయి. ఒక కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తూనే, మరో కంపెనీకి ఔట్సోర్సింగ్లో పనిచేస్తూ రెండు చేతులా సంపాదించే అవకాశం ఏర్పడింది. కొత్త ప్రాజెక్టులు పెరగడంతో ప్రెషర్స్తో పాటు నైపుణ్యం కలిగిన సీనియర్ ఉద్యోగులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న ఐటీ ఉద్యోగులు రెట్టింపు వేతనాలకు మరో కంపెనీకి మారడం, పనిచేస్తున్న కంపెనీలో ఏదైనా నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్లే పరిస్థితులకు దారితీస్తున్నది.
ఇబ్బందుల్లో మహిళా ఉద్యోగులు
వర్క్ ఫ్రమ్ హోం పద్ధతి మహిళా ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌకర్యంగా మారింది. గతంలో హడావుడిగా ఇంటి పనులు పూర్తిచేసుకొని ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చేది. పిల్లల ఆలనాపాలనకు అవకాశం తక్కువగా ఉండేంది. హైబ్రిడ్ పద్ధతిలో పిల్లలను దగ్గరుండి చూసుకోవడంతోపాటు కుటుంబంతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. రెండేండ్ల కాలాన్ని ఎంతో సౌకర్యవంతంగా గడిపిన మహిళా ఉద్యోగులు, ఇప్పుడు వర్క్ ఎట్ లొకేషన్ అనటంతో రాజీనామాకు సిద్ధపడుతున్నారు. 5-10 శాతం మంది మహిళలు కంపెనీలున్న ప్రాంతానికి వెళ్లలేకే రాజీనామా చేస్తున్నారని ఓ ఐటీ ఉద్యోగిని తెలిపారు.
మైక్రోసాఫ్ట్లో రెట్టింపు వేతనాలు
‘గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభాన్ని అధిగమించేందుకు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కాపాడుకొనే దిశగా టెక్నాలజీ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, సంస్థ బడ్జెట్ను దాదాపు రెండింతలు చేసే యోచనలో ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ‘మా భాగస్వాములు, కస్టమర్లకు విశేష సేవలందిస్తున్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు గొప్ప డిమాండ్ కనిపిస్తున్నది. అందుకే వారికి తగిన ప్రోత్సాహకాలు అందాలని నిర్ణయించాం’అని సత్య నాదెళ్ల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగుల వార్షిక స్టాక్ కేటాయింపులను గరిష్ఠంగా 67 శాతానికి మైక్రోసాఫ్ట్ పెంచనున్నది. కనీసం 25 శాతం స్టాక్స్ దక్కుతాయని బ్లూంబర్గ్ అంచనా వేసింది. మారిన ఆర్థిక పరిస్థితుల మధ్య చాలామంది ఉద్యోగులు కొలువులకు స్వచ్ఛందంగా వీడ్కోలు పలుకుతుండటం కార్పొరేట్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. నైపుణ్యం, ప్రతిభ కలిగిన సిబ్బంది సంస్థను వీడకుండా ఉండేందుకే ఈ బొనాంజాను మైక్రోసాఫ్ట్ తెస్తున్నదని సమచారం. పెరిగిన ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా వేతనాలను సవరించాలన్న ఉద్దేశం కూడా కారణమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెరీర్లో ఆరంభ, మధ్యస్థ దశల్లో ఉన్న ఉద్యోగులకు అధిక ప్రయోజనాలు ఉంటాయని తెలిసింది. ఈ ఏడాది జనవరిలో గూగుల్ నలుగురు ఉన్నతోద్యోగుల వేతనాలను 6.5 లక్షల డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల వరకు పెంచిన సంగతి తెలిసిందే.