హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మైనారిటీ , బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ ఒకే విధమైన పనివేళలు ఖరారు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. ఒక్కో సొసైటీ తిరిగి గతంలోని టైంటేబుల్నే అనుసరిస్తున్నది. ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా పనివేళలు నిర్ధారించడంపై నాడే సొసైటీల్లోని గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గురుకుల సొసైటీల్లోని పాఠశాలలు, కాలేజీలకు మొదటి నుంచీ ప్రత్యేక టైం టేబుల్ ఉన్నది. ఉదయం 9నుంచి సాయంత్రం 4:30గంటల వరకు పనివేళలుగా గతంలోనే నిర్ణయించారు. కొన్ని గురుకులాలు ఉదయం 8:30 నుంచి ప్రారంభమయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకుల సొసైటీలన్నింటికీ కామన్ టైంటేబుల్ నిర్ధారించింది. పనివేళలను ఉదయం 8గంటలకే ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది.
సాయంత్రం యథావిధిగా 4:30గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించింది. మొత్తంగా గంట సమయాన్ని అదనంగా పెంచింది. పాఠ్యప్రణాళికను సైతం సంక్లిష్టంగా, నిరంతరాయంగా నిర్వహించేలా రూపొందించింది. ఉదయం 8:15 గంటల నుంచి మధ్యాహ్నం1:25 వరకు ఏకబిగిన 7 పీరియడ్స్ నిర్వహించాలని నిర్దేశించింది. అందులో వ్యక్తిగత సమయం కేవలం 15నిమిషాలు మాత్రమే కావడం గమనార్హం. ఇది విద్యార్థులపై ఒత్తిడి పెంచడంతోపాటు, ఆచరణ అసాధ్యమని, గురుకులాల్లో చాలా వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటిలో అరకొర మౌలిక వసతులతో ప్రభుత్వం నిర్ణయించిన పనివేళలు అమలు చేయడం సాధ్యం కాదని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు మొత్తుకున్నాయి. కానీ సర్కార్ చెవికెక్కలేదు.
నాటి నుంచి పనివేళల రద్దు కోసం సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అనేక సార్లు ధర్నాలు సైతం నిర్వహించాయి. అయినప్పటికీ ప్రభుత్వం కామన్ టైంటేబుల్ను కొనసాగిస్తున్నది. గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది తమ సొసైటీల ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. వెరసి ఒక్కో సొసైటీ మళ్లీ పూర్వ టైంటేబుల్ను అనుసరించేందుకు అడుగులు వేస్తున్నది. తొలుత మైనారిటీ గురుకుల సొసైటీ పనివేళలను గతంలో మాదిరిగానే మార్చుకున్నది. ఇటీవల ఎస్సీ గురుకుల సొసైటీ సైతం కామన్ టైంటేబుల్ను పక్కకుపెట్టేసింది. గతంలోని పనివేళలు పాటించాలని నిర్ణయించింది. వెరసి మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కా మన్ టైంటేబుల్ అటకెక్కింది. జనరల్, బీసీ, ఎస్సీ గురుకులాల్లో కామన్ టైం టేబుల్ పాటిస్తున్నారు. ఆయా సొసైటీల్లోని సిబ్బంది సైతం పనివేళల మార్పునకు పట్టుబడుతున్నారు.