హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు అందించే మిల్లెట్ స్నాక్స్పై విశేష స్పందన వస్తున్నది. అక్టోబరు 16 నుంచి ప్రయాణికులకు ఈ స్నాక్స్ ప్యాకెట్ అందిస్తున్నారు. దీనికి చార్జీలోనే అదనంగా రూ.30 కలిపి తీసుకుంటున్నారు. మిల్లెట్స్ చిక్కి, రస్క్, కారా, టిష్యూ పేపర్ ఈ బాక్స్లో ఉంటాయి. ప్రయాణికులకు ఆరోగ్యవంతమైన ఆహారం అందించడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనలతో దీనిని అమలులోకి తెచ్చినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్యాకెట్లను ప్రయాణికులకు అందించినందుకు డ్రైవర్లకు ప్యాకెట్పై 50 పైసలు చెల్లిస్తున్నారు. మూడు నెలల క్రితమే ఆర్టీసీ మొదట ఇంటర్ స్టేట్ ఏసీ బస్సుల్లో స్నాక్స్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు ఓ ఫారం ఇచ్చి అభిప్రాయాలను సేకరించింది. మంచి స్పందన రావడంతో అక్టోబరు 16 నుంచి రాష్ట్రంలోని అన్ని ఏసీ బస్సుల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేషన్ పరిధిలో 11 రీజియన్లలో 300 ఏసీ బస్సులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ స్నాక్స్పై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. ప్రయాణికుల స్పందనను బట్టి సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ ప్రవేశపెడతామని అధికారులు చెప్పారు.