హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రాబోయే వేసవికాలంలో తాగునీటి సరాఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఆవాసాలు, విద్యాసంస్థలకు నిరాటంకంగా తాగునీటి సరఫరా కొనసాగాలని, అందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కేంద్ర కార్యాలయంలో తాగునీటి సరఫరాపై స్మితా సభర్వాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని అంతరాయాలు లేని తాగునీటి సరాఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
రిజర్వాయర్ల నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని, ఇంటేక్వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఉన్న పంపులు, మోటార్ల పనితీరును సరిచూసుకోవడంతోపాటు సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతోపాటు మెయిన్, సెకండరీ పైప్లైన్లలో ఎకడైనా లీకేజీలు ఏర్పడినా.. వెంటనే రిపేర్ చేసే మొబైల్ టీంలను నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. ఇక మారుమూల, అటవీ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలు, రెసిడెన్షియల్ సూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ తాగునీటి సరఫరా తీరుపై గిరిజన, సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూతో కలిసి స్మితా సభర్వాల్ సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈఎన్సీ కృపాకర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్తోపాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజినీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.