జమ్మికుంట/వీణవంక, జూలై 21: ఉప ఎన్నిక రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్కు చుక్కెదురవుతున్నది. తన ఏజెంట్లతో దొంగచాటుగా ఇంటింటికీ గోడ గడియారాలు అందిం చే ప్రయత్నం చేస్తుండగా, ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తాయిలాలపై పంపిణీపై తిరగబడుతున్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవాపూర్(15వ వార్డు) ప్రజలు గోడ గడియారాల పంపిణీని అడ్డుకున్నారు. అప్పటికే కొన్నిచోట్ల పంపిణీ చేసిన వాచీలను నడిరోడ్డు మీదకు తీసుకొచ్చిన యువకులు, నేలకేసి కొట్టి తునాతునకలు చేశారు. ‘50 రూపాయల విలువచేసే గడియారాలు ఇచ్చి ఆశ చూపుతావా..?, గోడ గడియారాలతో మా ఓట్లు కొంటావా?’ అంటూ మండిపడ్డారు. ఇలాంటి తాయిలాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఎన్ని తాయిలాలు అందించినా.. టీఆర్ఎస్కే ఓటేస్తామని వారు స్పష్టం చేశారు. అలాగే వీణవంక మండలం చల్లూరు, ఎలుబాక గ్రామ దళితులు సైతం బీజేపీ నాయకులు పంపిణీ చేసిన గడియారాలను అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, డప్పుచప్పుళ్ల మధ్య నడి రోడ్డుపై పగులగొట్టారు. కాళ్లతో తొక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈటల రాజేందర్ ఏమీ చేయలేదన్నారు. ఉప ఎన్నికలు వస్తున్నాయని దళితులను ప్రలోభాలకు గురిచేయడానికి గోడ గడియారాలు పంపిణీ చేయిస్తున్నాడని మండిపడ్డారు. ఈటల రాజేందర్ తన సొంత ఆస్తులను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లాడని, ప్రలోభాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. తామంతా టీఆర్ఎస్ వెంటే ఉంటామని, రానున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో దళిత సంఘం నాయకులు తాండ్ర శంకర్, తాండ్ర రమేశ్, ఊట్ల దేవయ్య, ఊట్ల జాన్, స్టీఫెన్, జీవయ్య తదితరులు పాల్గొన్నారు.