హైదరాబాద్ : సేవా రంగంలో శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ఆయుర్వేద ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ఆయుర్వేద ట్రస్ట్ (SMRTA) ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్ధులకు ల్యాప్ టాప్ లు పంపిణీ చేసి మాట్లాడారు.
తెలంగాణకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ శరత్ అద్దంకి విదేశాల్లో స్థిరపడి SMRTA ట్రస్ట్ నిర్వహిస్తూ గడిచిన రెండు సంవత్సరాలుగా అందరికి విద్య, అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమం చేపడుతుండటం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలకు చెందిన 152 మంది విద్యార్ధులకు తమ ట్రస్ట్ ద్వారా దాదాపు పది కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం సంతోషకరమన్నారు.
స్వలాభం కోసం కాకుండా ప్రజా సేవే లక్ష్యంగా ట్రస్ట్ సేవలు అందించడం ద్వారా ఎంతో మంది పేదలకు మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు. ఒక్క విద్యారంగంలోనే కాకుండా ఆరోగ్య, సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం ద్వారా పేదలకు వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు. స్మార్టా ట్రస్ట్ కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లయితే పేదలకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్ధులకు సహాయం చేస్తున్న ట్రస్ట్ ను ఆదర్శంగా తీసుకొని ఇతర స్వచ్చంద సంస్థలు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులతో పాటు గురుకుల విద్యాసంస్థ అధికారులు పాల్గొన్నారు.