హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న పోలీస్ కమిషనరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాల(డీపీవో) భవన నిర్మాణాలు తుది దశకు చేరకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లా పోలీస్ కార్యాలయాలు, రెండు పోలీస్ కమిషనరేట్లతోపాటు చాలా జిల్లాల్లో పోలీస్స్టేషన్ల భవనాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్మిస్తున్నది.
రూ. 654.50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణాల్లో ఇప్పటికే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవన సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించా రు. మిగిలిన భవనాలు సైతం వీలైనంత త్వర గా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా పోలీస్శాఖ ఉన్నతాధికారులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరు నాటికి గద్వాల, వనపర్తి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ పోలీస్ కార్యాలయాలు, రామగుండం సీపీ భవనాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నారు.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సమాచారం మేరకు భవనాల నిర్మాణం ఇలా..
పోలీస్ సేవలు మరింత చేరువ
ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేవిధంగా అత్యాధునిక హంగులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘స్మార్ట్ బిల్డింగ్స్’ను నిర్మిస్తున్నారు. నూతన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, అదనపు ఎస్పీ కార్యాలయాలు, జిల్లా పోలీస్ విభాగం నిర్వహణ అధికారుల చాంబర్లు, ఏఆర్ హెడ్క్వార్టర్లు, పరేడ్గ్రౌండ్, డిజిటల్ ల్యాబ్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, సిబ్బందికి బ్యారెక్స్ నిర్మించనున్నారు. తొలివిడతలో ఎస్పీ, అదనపు ఎస్పీల కార్యాలయాలు, పరేడ్గ్రౌండ్, ఎస్పీ నివాసాలను నిర్మిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పోలీస్స్టేషన్కు వచ్చే పౌరులతోపాటు సిబ్బందికి సైతం అన్ని మౌలిక వసతులు ఉండేలా నిర్మించనున్నారు.
సీఎం సంకల్పంతోనే అత్యాధునిక భవనాలు
పోలీస్ వ్యవస్థతోపాటు పోలీస్ భవనాలను కూడా ఆధునికీకరించాలని, పోలీస్స్టేషన్లు, పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వసతులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. కార్పొరేషన్ చేపట్టిన పోలీస్ భవనాలన్నింటినీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నాం. ఈ విధమైన ‘స్మార్ట్ బిల్డింగ్స్’ నిర్మిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ. ఈ-టెండర్స్ ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
-కోలేటి దామోదర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్