హైదరాబాద్ : నిద్రలేమి వల్ల ఆరోగ్య సమస్యలు, పనిమీద ప్రభావం పడుతుందని టీఎస్ఆర్టీసీ (TS RTC ) ఎండీ, వీసీ సజ్జనర్(Sajjanor) పేర్కొన్నారు. ప్రతి మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్ర అవసరమని అన్నారు. అంతర్జాతీయ నిద్ర దినోత్సవం(World Sleep Day) సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ బస్భవన్లో ‘వరల్డ్ స్లీప్ డే థీమ్’ను ప్రముఖ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ కొవిడ్ (Covid)ఉధృతి తర్వాత నిద్ర సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని ఆయన వెల్లడించారు. నిద్రలేమి వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని వివరించారు. స్మార్ట్ఫోన్(Smart Phones), ఇతర గ్యాడ్జెట్స్తో బెడ్పై గంటల కొద్దీ గడపొద్దన్నారు. నిద్ర సంబంధిత సమస్యలపై ప్రజలు స్వీయ అవగాహన కలిగిఉండాలన్నారు.
సరిగా నిద్రరాకుంటే ట్యాబ్లెట్లు వేసుకోవడం అందరికీ అలవాటుగా మారిందని, వాటి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందనిహెచ్చరించారు. నిద్ర ప్రాముఖ్యంతో పాటు ఆరోగ్య సమస్యలపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.ప్రముఖ స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామనుకోవడం సరికాదన్నారు. నిద్రలేమి వల్ల హైపర్టెన్షన్, గుండె సమస్యలు, డిప్రెషన్, తదితర సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని మార్చుకుని సమయానికి నిద్రపోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవనప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, న్యూట్రిషియనిస్ట్ కావ్య తదితరులు పాల్గొన్నారు.