హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కొత్త నాయమూర్తుల నియామకాన్ని ధ్రువీకరిస్తూ శుక్రవారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజా శరత్ను న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావును అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి రాజేందర్ కశ్యప్ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి రాష్ట్రపతికి నివేదించింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఆరుగురితో న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ప్రమాణం చేయించే అవకాశం ఉన్నది. హైకోర్టులోని 42 మంది న్యాయమూర్తుల్లో పదిమంది అదనపు న్యాయమూర్తులు ఉంటారు.
35కు చేరనున్న న్యాయమూర్తులు
ప్రస్తుతం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితోకలిపి 29 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొత్తగా ఆరుగురి నియామకంతో వారి సంఖ్య 35కి చేరనున్నది. తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పాటైనప్పుడు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 24. సీఎం కేసీఆర్ చొరవతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంఖ్య 42కు పెరిగింది. తాజా నియామకాల తర్వాత హైకోర్టులో 8 పోస్టులు ఖాళీగా ఉంటాయి. కొత్తగా నియమితులైన ఆరుగురిలో ఇద్దరు భద్రాచలం పట్టణానికి చెందిన వారున్నారు. పూర్వపు కరీంనగర్ జిల్లాలకు చెందిన ముగ్గురు (రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్) ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి ఒకరు ఉన్నారు. హైకోర్టు చరిత్రలో తొలిసారి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి వ్యక్తి న్యాయమూర్తి కాబోతున్నారు.