హైదరాబాద్ : సూర్యాపేట మెడికల్ కాలేజీలో రెండు రోజుల క్రితం ర్యాగింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటనలో 2019-20 బ్యాచ్కు చెందిన ఆరుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టు డీఎంఈ రమేశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ నుంచి ఆ ఆరుగురిని శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడుతున్నారంటూ ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఒంటిపై దుస్తులు తొలగించి ఫోటోలు తీశారని, ట్రిమ్మర్తో జుట్టు తొలగించేందుకు సీనియర్లు యత్నించారని బాధిత విద్యార్థి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీనియర్ల నుంచి తప్పించుకున్న సదరు విద్యార్థి తనకు జరిగిన అవమానాన్ని ఫోన్లో తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో విద్యార్థి తండ్రి డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో బాధితుడిని పోలీసులు రక్షించారు.