శ్రీరంగాపూర్/మరికల్, మే8: వేర్వేరు చోట్ల నీట మునిగి సోమవారం ఆరుగురు బాలికలు మృతి చెందిన సంఘటనలు వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన రైతు కురుమయ్య, భాగ్యమ్మ దంపతులకు తిరుపతమ్మ(14, పదో తరగతి), సంధ్య(12, ఆరో తరగతి), దీపిక(10, నాలుగో తరగతి)తోపాటు కుమారుడు ఉన్నాడు. వేసవి సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు గ్రామ సమీపంలోని వీరసముద్రం చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు. చెరువు గట్టుపై తిరుపతమ్మ బట్టలు ఉతుకుతుండగా.. సరదాగా నీటిలోకి దిగిన దీపిక మునిగిపోతుండగా.. సంధ్య కాపాడే క్రమంలో ఆమె కూడా మునిగింది. చెల్లెళ్లను కాపాడేందుకు నీటిలోకి దిగిన తిరుపతమ్మతోసహా ఈత రాక ముగ్గురూ నీట మునిగారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండలో పెళ్లింట విషాదం నెలకొన్నది. పెండ్లికి వచ్చిన ఇద్దరు బాలికలతోపాటు పెండ్లి కూతురు చెల్లెలు సరదాగా చెక్డ్యాం వద్దకు వెళ్లి నీట మునిగి మృతి చెందారు. బాజాభజంత్రీలతో రెండ్రోజులుగా సందడిగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి.